కాళేశ్వరం (kaleswaram) ప్రాజెక్ట్ అవినీతి విషయంలో బీఆర్ఎస్ (BRS) నేతలు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) మండిపడ్డారు. కేసీఆర్ అహంభావం, అవినీతి వల్లే ఉద్యమ పార్టీకి సైతం ప్రజలు బుద్ది చెప్పారని విమర్శించారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోతాయా అని ప్రశ్నిస్తున్న కేసీఆర్ను చూస్తుంటే, ఇన్నాళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా పని చేశారనే అనుమానం కలుగుతోందన్నారు.
హైదరాబాద్ (Hyderabad) పార్టీ కార్యాలయంలో మాట్లాడిన నారాయణ, బీఆర్ఎస్ పార్టీ వైఖరి, రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న మోడీ సర్కార్, ఏపీ రాజకీయాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. అసలెందుకు కేసీఆర్ (KCR) ఎన్నికల్లో పోటీ చేశారని, గెలిచిన తర్వాత అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. పదేళ్లు ప్రజా సంపాదనను దోచుకుని, ఇప్పుడు అసెంబ్లీకి పోవడానికి మనస్సు ఒప్పడం లేదని విమర్శించారు..
కేసీఆర్ ఒకప్పుడు అసెంబ్లీ నుంచి గెంటేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారనే బాధ ఆయనలో క్షుణంగా కనిపిస్తోందని తెలిపిన నారాయణ.. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు శాశ్వతంగా రామని బాయ్కాట్ చేయడమేంటని ప్రశ్నించారు. పార్టీ నేతల్ని గొర్రెలుగా తయారుచేసిన కేసీఆర్.. ఇష్టమున్నట్లు ఆడిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై కేసీఆర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు.
కాళేశ్వరం అవినీతి వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని కోరుతోన్న బీజేపీ.. ఈ కేసు నుంచి కేసీఆర్ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా రూ.వేల కోట్ల అవినీతికి బాధ్యుడైన కేసీఆర్పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక మొన్నటి వరకు బీఆర్ఎస్ వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఆశ చావని హరీష్ రావు.. సీఎం పదవి ఇస్తే అభివృద్ధి చేస్తామని సిగ్గుచేటని నారాయణ విమర్శించారు. బీఆర్ఎస్ సీఎం పదవి కోసం చాలా ఆరాటపడుతోందని మండిపడ్డారు..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకముందే ప్రభుత్వంపై విమర్శలు చేయడం బీఆర్ఎస్ పతనానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. మరోవైపు నారాయణ, కేంద్రప్రభుత్వం, ఏపీ రాజకీయాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రధాన మంత్రి ఓవైపు దేవుళ్లను పూజిస్తూ, మరోవైపు రైతులను చితక బాదుతున్నారని ఆరోపించారు. ఏ దేవుడైనా అన్నం పెట్టే అన్నదాతను కొట్టమని చెప్పారా అని ప్రశ్నించారు. ఈ పార్టీలన్నీ బీజేపీ తొత్తులని ఆరోపించిన నారాయణ.. జగన్, చంద్రబాబు తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆగ్రహించారు..