Telugu News » Srisailam : మహా కుంభాభిషేకం ముహూర్తం ఎవరు నిర్ణయించారు?

Srisailam : మహా కుంభాభిషేకం ముహూర్తం ఎవరు నిర్ణయించారు?

మార్చి 18న అందరి పీఠాధిపతుల ఏకాభిప్రాయంగా ముహూర్తాన్ని నిర్ణయించారు. అయితే.. ఎన్నికల్లోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని రాజకీయ ఒత్తిడి ఎక్కువైంది. మంత్రి కొట్టు సత్యనారాయణ జోక్యం వల్ల.. మహా కుంభాభిషేకం కోసం ముందే ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.

by admin
srisailam

– శ్రీశైలంలో మరోసారి రాజకీయ జోక్యం
– మహా కుంభాభిషేకం ముహూర్తంపై వివాదం
– పీఠాధిపతులు పెట్టిన ముహూర్తాన్ని కాదని కార్యక్రమం
– ఎన్నికలకు ముందే నిర్వహించాలని మంత్రి ఆదేశాలు
– ఆయన పెట్టిన ముహూర్తాన్నే కోర్టులో చెప్పారా?
– అసలు, పీఠాధిపతులు నిర్ణయించిన ముహూర్తం ఏంటి?

శ్రీశైలంలో మహా కుంభాభిషేకం వివాదం రాజకీయ టర్న్ తీసుకుంది. పీఠాధిపతులు నిర్ణయించిన ముహూర్తానికి కాకుండా రాజకీయ నాయకుల ఒత్తిడితో ముందే జరుపుతుండడం అరిష్టం అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆలయ శాస్త్రం ప్రకారం కార్యక్రమాలు జరగాలని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకునేది లేదని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Another fight in Srisailam

వివాదం ఏంటి?

శ్రీశైలంలో ప్రతీ 12 ఏళ్లకు ఓసారి మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు. గతేడాది ఆలయ ఈవో ఆధ్వర్యంలో రూ.కోట్లు ఖర్చు చేసి ఏర్పాట్లు చేశారు. శివాజీ గోపురంతో పాటు ప్రధానాలయాలు, ఉపాలయాలకు పరంజాలు సిద్ధం చేశారు. రంగులతో అలంకారాలు, విద్యుద్దీపాల ఏర్పాట్లు చేపట్టారు. ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ముహూర్తాలు ఖరారు చేశారు. ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఇక ప్రారంభమే తరువాయి అన్న క్షణంలో ముహూర్తం నిర్ణయించే విషయంలో పీఠాధిపతులకు ప్రాధాన్యం ఇవ్వలేదని వివాదం మొదలైంది. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారింది. ఉత్తరాయణంలో చేయాల్సిన కార్యాన్ని దక్షిణాయనంలో చేస్తామని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ప్రకటించి అగ్నికి ఆజ్యం పోశారు.

కోర్టుకు చేరిన పంచాయితీ

శ్రీశైలంలో మహాకుంభాభిషేకం, ఇతర కార్యక్రమాల నిర్వహణను వాయిదా వేస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్‌ చైర్మన్‌ సంగాల సాగర్‌ ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గతేడాది మే నెలలో విచారణ జరిపిన ధర్మాసనం.. ముహూర్తం తిరిగి ఖరారు చేయాలని దేవాదాయశాఖను, శ్రీశైలం దేవస్థానం ఈవోను ఆదేశించింది. అందుకోసం సంప్రదింపుల ప్రక్రియను గరిష్ఠంగా ఆరు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అయితే.. తాజాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ముహూర్తం నిర్ణయించేందుకు దేవస్థానం ఏడు నెలల సమయం తీసుకోవడంపై అభ్యంతరం తెలిపింది. దీంతో ఈ నెల 16 నుంచి శ్రీశైలం దేవస్థానంలో వివిధ కార్యక్రమాలు ప్రారంభించి 21న మహా కుంభాభిషేకం నిర్వహిస్తామని దేవాదాయశాఖ న్యాయవాది తెలిపారు. కుంభాభిషేకం నిర్వహణకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను కోర్టుకి అందజేశారు. ఈ వివరాలు నమోదు చేసిన న్యాయస్థానం పిల్ పై విచారణ మూసివేసింది.

ముహూర్తంపై రాజకీయ జోక్యం

కుంభాభిషేకం ముహూర్త విషయంపై దేవస్థానం వారు వైదిక కమిటీ శృంగేరి పీఠం, కంచి పీఠం, పుష్పగిరి పీఠం, విశాఖ శారదా పీఠాలను సంప్రదించారు. నాలుగు ముహూర్తాలు నిర్ణయించగా వాటిలో.. మార్చి 18న అందరి పీఠాధిపతుల ఏకాభిప్రాయంగా ముహూర్తాన్ని నిర్ణయించారు. అయితే.. ఎన్నికల్లోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని రాజకీయ ఒత్తిడి ఎక్కువైంది. మంత్రి కొట్టు సత్యనారాయణ జోక్యం వల్ల.. మహా కుంభాభిషేకం కోసం ముందే ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. మార్చి 1 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆ ఏర్పాట్లలో ఆలయ అధికారులు తలమునకలయ్యారు. ఇలాంటి సమయంలో మహా కుంభాభిషేకం విషయంలో రాజకీయ ఒత్తిడి ఎక్కువవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయంపై అర్చకుల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మంత్రి నిర్ణయించిన ముహూర్తానికి జరపడం ఏంటి?

కారణాగమం ప్రకారం మాఘ మాసం ప్రతిష్ఠలకు పనికిరాదు. అనాదిగా శ్రీశైల దేవస్థానంలో సనాతన ధర్మం సాంప్రదాయ పద్దతులను అనుసరిస్తూ శైవాగమం ప్రకారం కుంబాభిషేకం విషయమై శృంగేరి పీఠాధిపతులను కంచి పీఠాధపతులను సంప్రదించి వారు నిర్ణయించిన ముహూర్తానికే కార్యక్రమం జరుపుతారు. అయితే.. ఈసారి అందుకు భిన్నంగా పీఠాధిపతులు నిర్ణయించిన ముహూర్తానికి కాకుండా కార్యక్రమాలను జరుపుతున్నారు. ఈనెల 16 నుంచి నిర్వహించాలని దేవాదాయ శాఖ దేవస్థానం వారిని ఆదేశించారు. ఈ ముహూర్తంలో జరపడం ప్రామాణికం కాదు. శాస్త్ర సమ్మతం కాదు. ఆగమ శాస్త్ర విరుద్ధం. పీఠాధిపతులు నిర్ణయించిన ముహూర్తాన్ని కాదని చేయుట శ్రేయస్కరం కాదని హిందూవులు అంటున్నారు. లోకక్షేమం కాదు. కేవలం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నిర్ణయించిన ముహూర్తానికి కార్యక్రమం జరపడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, పండితులు, పీఠాధిపతులు, స్థానిక సిబ్బంది ఇంతమందికి ఇష్టం లేకుండా పీఠాధిపతుల యొక్క సమక్షంలో జరుగకుండా కార్యక్రమం చేయటం అనేది లోక కళ్యాణం కాకపోగా దేశారిష్టమని అంటున్నారు. కావున ప్రస్తుతం కుంభాభిషేకం నిలిపివేసి పీఠాధిపతులు నిర్ణయించిన ముహూర్తానికి జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ప్రశ్నలకు బదులేది?

ముహూర్తం గురించి కోర్టు స్వామీజీలను సంప్రదించి నిర్ణయం తీసుకోమని చెప్పింది. కానీ, ఏ స్వామీజీలను సంప్రదించి కొత్త ముహూర్తం నిర్ణయించారు? దేవాదాయ శాఖలో గతంలో ముహూర్తాలు ఎలా నిర్ణయించారు? ఎవరిని ఏ స్వామీజీని ప్రామాణికంగా తీసుకున్నారు? శ్రీశైలం దేవాలయంలో గతం నుండి పాటిస్తున్న విధి విధానాలు ఏంటి? వాటిని కాదని ఇప్పుడు కొత్త వారిని ఎందుకు సంప్రదిస్తున్నారు? శృంగేరి వారే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని గతంలో బగలాముఖి హోమం ప్రవేశపెట్టిన సమయంలో కమీషనర్ వారు కోర్టు కు తెలిపి ఆ యొక్క హోమం ఆపారు. మరి, అదే కమీషనర్ ఆ పద్దతిని ఇప్పుడు ఎందుకు పాటించలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

You may also like

Leave a Comment