కాంగ్రెస్ (Congress) నేతలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ (BRS) ఉండదనే ఆరోపణలు చేస్తున్న క్రమంలో.. గులాబి నేతలు సైతం హస్తం పై తీవ్రంగా విమర్శలు గుప్పించడం కనిపిస్తోంది. కాగా తుక్కుగూడ (Tukkuguda)లో కాంగ్రెస్ నిర్వహించిన సభపై.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆ సభలో రాహూల్ గాంధీతో పచ్చి అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు..

అలాగే రేవంత్ రెడ్డి గతంలో 1500లకు పై చిలుకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయని మాట్లాడారు.. కానీ ఇప్పుడు 560 ఉద్యోగాలు మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారో అని ప్రశ్నించారు.. ఇదిగాక పక్కింటి కాయలు దోచేసి.. ఇవి మా కాయలు అని చెప్పుకొన్నట్లు.. 30 వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇస్తే.. తామే ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు..
మరోవైపు కాంగ్రెస్ లో ఎంపీ అభ్యర్థులు డమ్మీ అభ్యర్థులే అని ఆరోపించిన బాల్క సుమన్.. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములని.. అందుకే కిషన్ రెడ్డి గెలుపు కోసం దానం నాగేందర్ ను మా పార్టీ నుంచి తీసుకోని ప్రకటించినట్లు ఆరోపించారు.. మోడీ బడే బాయ్.. రేవంత్ రెడ్డి చోటే బాయ్. అందుకే మోడీ చెప్పినట్లుగా తెలంగాణలో డమ్మీ అభ్యర్థులను ప్రకటించారని మండిపడ్డారు..