Telugu News » BRS : ఓరుగల్లులో గల్లంతు అవుతున్న గులాబి.. కాంగ్రెస్‌లోకి మరో ఇద్దరు..!

BRS : ఓరుగల్లులో గల్లంతు అవుతున్న గులాబి.. కాంగ్రెస్‌లోకి మరో ఇద్దరు..!

గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు ప్రధాన అనుచ‌రుడిగా ఉన్న మార్నేని అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం నుంచి పార్టీ మారుతాడ‌న్న ప్రచారం జ‌రుగుతోంది.

by Venu

ఒక్క ఓటమి బీఆర్ఎస్ (BRS) ఉనికికే ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే వలసలను ఆపలేక.. లోక సభ సమరానికి అభ్యర్థులు దొరక్క అల్లాడుతున్న కారు పార్టీకి మరో షాక్ తగిలింది. దాదాపు 23 ఏండ్ల పాటు తెలంగాణ (Telangana) ఉద్యమం.. అధికారంలో ఉన్న పదేండ్లు కలిపి ఏనాడు ఇంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోలేదనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే గ్రేటర్ వరంగల్ తో పాటు మున్సిపాలిటీ, మండలాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా లీడర్లు కాంగ్రెస్‍ కండువాలు కప్పుకోవడం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ (Warangal) డీసీసీబీ (DCCB) చైర్మన్ మార్నేని రవీందర్ రావు (Marneni Ravinder Rao), ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతిలు కారు దిగుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రికొద్దిసేప‌ట్లో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు సమాచారం.

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స‌మ‌క్షంలో పార్టీలో చేరేందుకు ఇప్పటికే వారు హైద‌రాబాద్‌ (Hyderabad)కు చేరుకొన్నారని చర్చించుకొంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. ప్రభుత్వ స‌ల‌హాదారు, మాజీ ఎమ్మెల్యే వేం న‌రేంద‌ర్ రెడ్డితో కొంత‌కాలంగా ట‌చ్‌లో ఉన్న మార్నేని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమ‌య్యారని తెలుస్తోంది. ఈ దంపతులను ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం వ‌ద్దకు తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.

గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు ప్రధాన అనుచ‌రుడిగా ఉన్న మార్నేని అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం నుంచి పార్టీ మారుతాడ‌న్న ప్రచారం జ‌రుగుతోంది. అదీగాక బీఆర్ఎస్ కి అంటి ముట్టనట్లుగా వ్యవహరించడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చింది. అయితే ఆ సమయంలో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు ప‌లుమార్లు మార్నేనితో చ‌ర్చలు జ‌రిపిన‌ట్లుగా స‌మాచారం. కానీ చివ‌రికి పార్టీ మార్పున‌కే జై కొట్టారు..

You may also like

Leave a Comment