Telugu News » ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ…. ఆ రెండు కీలక బిల్లులను ఆమోదించాలని విజ్ఞప్తి…!

ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ…. ఆ రెండు కీలక బిల్లులను ఆమోదించాలని విజ్ఞప్తి…!

ఈ సారి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ బిల్లులను ప్రవేశ పెట్టాలని మోడీని కేసీఆర్ లేఖలో కోరారు.

by Ramu
cm kcr

ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఈ సారి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ బిల్లులను ప్రవేశ పెట్టాలని లేఖలో కోరారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ 2014లో తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి పంపిందన్నారు.

cm kcr wrote letter to pm modi

కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అదే విధంగా చట్ట సభల్లో ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ 2023లో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీర్మానం చేశామని తెలిపారు. అందువల్ల ఈ సమావేశాల్లో ఆ రెండు బిల్లుల ఆమోదానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రధానిని కేసీఆర్ కోరారు.

మరోవైపు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలతో ఆయన చర్చించారు. ఈ సందర్బంగా పార్టీ ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి ఆమోదం తెలిపేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సభ్యులకు ఆయన సూచించారు. ఈ విషయంపై ఉభయ సభల్లో గళం వినిపించాలని సభ్యులకు ఆయన సూచించారు.

ఇక ఈ సమావేశాల్లో కేంద్రం ఏదైనా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే తానే ఢిల్లీకి వచ్చి పోరాటం చేస్తానని ఎంపీలతో ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు దేశంలో జమిలీ ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ సందర్బంలో ఆయన జమిలీ ఎన్నికల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జమిలీ ఎన్నికలు వచ్చినా లేదా వేరు వేరుగా నిర్వహించినా తమ పార్టీదే విజయమని ఆయన అన్నారు. బీఆర్ఎస్ విజయంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.

 

You may also like

Leave a Comment