మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. జిల్లాలోని బాలానగర్ చౌరస్తాలో ఆగి ఉన్న ఆటో (Auto)ను డీసీఎం (DCM) ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. దీంతో మహబూబ్ నగర్ (Mahaboob Nagar) జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో జాతీయ రహదారి 44పై ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
వారంతపు సంత కోసం బాలా నగర్ చుట్టు పక్కల తండాల నుంచి గిరిజనులు మండల కేంద్రమైన బాలానగర్ కు వచ్చారు. కూరగాయలు, ఇతర వస్తువులు కొనుక్కుని తిరిగి తమ తండాలకు ఆటోలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగింది. మృతులను మండలంలోని మేడిగడ్డా తండా, నందారం, బీబీనగర్ తండా వాసులుగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదం నేపథ్యంలో జాతీయ రహదారిపై మృతులు ధర్నా చేశారు. అక్కడకు వచ్చిన జడ్చర్ల సీఐ, బాలా నగర్ రూరల్ ఎస్సైలను మృతుల బంధువులు నిర్బంధించారు. అంతకు ముందు ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఆందోళనకారులకు నచ్చ జెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.