కేటీఆర్ (KTR) 420 అని అందరికీ తెలుసని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) విమర్శించారు. ఒకప్పుడు హైదరాబాద్లో చిన్న ప్లాట్ కూడా లేకుండేదని, కానీ ఇప్పుడు ఏ ఫామ్ హౌస్ చూసినా కేటీఆర్దే అంటున్నారని చెప్పారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయడం తమ బాధ్యత అని తెలిపారు.
కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేయలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్ పై తాము ఇచ్చిన హామీల అమలుకు ఎంత బడ్జెట్ అవసరం అనే దానిపై సమీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎల్లుండి సెక్రటరీలతో సమావేశం అవుతామని వివరించారు. బడ్జెట్ అంచనాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు.
100 రోజుల్లో హామీలు పూర్తి చేస్తామని మాటిచ్చామన్నారు. ఇచ్చిన హామీల అమలుకు ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంపై ప్రధానంగా చర్చ చేపడతామని వెల్లడించారు. తాము పుట్టిన 24 రోజులకే హామీలు ఏమయ్యాయంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. మరి బీఆర్ఎస్ ఇచ్చిన దళితుల మూడెకరాల భూములు, మైనార్టీ రిజర్వేషన్ హామీలు ఏమయ్యాయి కేటీఆర్ అని ప్రశ్నించారు.
ఫోన్లో కేటీఆర్ ఆదేశాలు ఇవ్వగానే రూ. 100 కోట్లు ఇచ్చాడంట.. అది ఎట్లా సాధ్యం అయిందని ప్రశ్నలు వేశారు. ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ల మీదనే పడుతుందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై క్రిమినల్ కేసులు పెట్టాలి.. ఎవరి డైరెక్షన్లో చేశారు అనేది తేల్చాలన్నారు. తప్పుడు లెక్కలు చెప్పే ప్రభుత్వం తమది కాదన్నారు. బడ్జెట్ పరిస్థితి చెప్పి.. అందుకు అనుగుణంగా అమలు చేస్తామని వివరణ ఇచ్చారు.
మైనార్టీ శాఖ సీఎం దగ్గరే ఉందన్నారు. నేరుగా ఆయనే చూస్తున్నారని తెలిపారు.. పదవుల్లో ఎక్కువ తక్కువ అనేది ఉండదన్నారు.. తనకు ఈ అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. 85 శాతం జనాభా ఉన్న ప్రజలకు సబందించిన బాధ్యతను తనకు ఇచ్చారని షబ్బీర్ అలీ అన్నారు.