Telugu News » Organic murder : యూట్యూబ్ చూసి భార్యకు ప్రసవం చేశాడు…ఇంకేముంది..!?

Organic murder : యూట్యూబ్ చూసి భార్యకు ప్రసవం చేశాడు…ఇంకేముంది..!?

పిచ్చి పలు రకాలంటారు. యూట్యూబ్ చూసి వంటలు చేసినట్టుగా తన భార్యకు ప్రసవాన్ని చేశాడో చాదస్తపు భర్త. అతను చేసిన ప్రయోగానికి ఓ మగబిడ్డకు జన్మనిచ్చి పాపం ఆ అమాయకురాలు చనిపోయింది

by sai krishna

పిచ్చి పలు రకాలంటారు. యూట్యూబ్ చూసి వంటలు చేసినట్టుగా తన భార్యకు ప్రసవాన్ని చేశాడో చాదస్తపు భర్త. అతను చేసిన ప్రయోగానికి ఓ మగబిడ్డకు జన్మనిచ్చి పాపం ఆ అమాయకురాలు చనిపోయింది.ఈ వింత ఘటన తమిళనాడు(Tamil Nadu)రాష్ట్రం లోని కృష్ణగిరి జిల్లాలో జరిగింది. దీంతో ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు.

పోలీసుల సమాచారం ప్రకారం…పోచంపల్లి సమీపంలోని పులియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకి(Lokanayaki) అనే యువతికి ధర్మపురి జిల్లా(Dharmapuri District)లోని అనుమంతపురం గ్రామానికి చెందిన మాదేశ్తో 2021లో వివాహం జరిగింది.

అతడు సేంద్రియ(organic) పద్ధతిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ అదృష్టమే తన పాలిట దురదృష్టంగా మారింది. ఇటీవల గర్భం దాల్చిన లోకనాయకిని సేంద్రీయ పద్ధతిలో ట్రీట్ చేయడం మొదలు పెట్టాడు మాదేశ్. అందుకోసం లోకనాయకికి ఎలాంటి వైద్యం అందించలేదు.

స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైద్యులు లోకనాయకి గర్భం దాల్చిన విషయం తెలిసి.. ఆమెకు వైద్య సదుపాయం అందించాలని ప్రయత్నించేవారు. ప్రభుత్వ రికార్డు(Government record)ల్లో నమోదు చేసుకోవాలని సూచించినా..మాదేశ్ తన మూర్ఖత్వంతో అందుకు ఒప్పుకోలేదు.

ప్రసవ సమయంలో ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లతో పాటు పౌష్ఠికాహారాన్ని సైతం నిరాకరించేవాడు. స్థానిక వైద్యాధికారి పట్టుపట్టడం వల్ల రెండు వ్యాక్సిన్లను వేయడానికి అనుమతిచ్చాడు. ఆ తర్వాత లోకనాయకి పరిస్థితిని గమనించిన స్థానిక వైద్యాధికారులు.. ఆమెకు వైద్యం చేయడం తప్పనిసరని సూచించారు.


అదే పనిగా వైద్యాధికారులు ఒత్తిడి మేరకు.. లోకనాయకిని తీసుకుని తన స్వగ్రామానికి వెళ్లి అక్కడే చికిత్స చేస్తున్నాడు. పౌష్ఠికాహారం కోసం ప్రధానంగా గింజలు, ఆకుకూరలు అందించేవాడు.అయితే,ఈ క్రమంలోనే ఆగస్టు 22న ఇంట్లో ఉన్న లోకనాయకికి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి.

వెంటనే తన ఫోన్లో చూసి లోకనాయకికి చికిత్స అందించాడు మాదేశ్( Madesh). సరైన రీతిలో వైద్యం అందించకపోవడం వల్ల మగ శిశువుకు జన్మనిచ్చిన లోకనాయకి అపస్మారక స్థితి(unconsciousness)లోకి వెళ్లిపోయింది.

వెంటనే అప్రమత్తమైన మాదేశ్..కున్నియార్లోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో లోకనాయకి మరణించింది. ఆందోళనకు గురైన మాదేశ్.. మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా తన స్వగ్రామానికి తీసుకుని వెళ్లాడు.

ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక వైద్యాధికారి శశికుమార్.. పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…లోకనాయకి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం పోచంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రభుత్వ వైద్యురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

You may also like

Leave a Comment