గోషామహల్ (Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) ఆధ్వర్యంలో హైదరాబాద్ (Hyderabad)లో శ్రీరామ శోభాయాత్ర అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీకి నగరం నలుమూలల నుంచి బీజేపీ శ్రేణలు, రామ భక్తులు, హిందూ సంఘాల నేతలు పెద్ద ఎత్తున హాజరైయ్యారు. కన్నుల పండుగగా.. అశేష భక్త జనుల మధ్య శోభాయమానంగా రామయ్య యాత్ర సాగింది.

మరోవైపు అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. జలమండలి ఆధ్వర్యంలో మంచినీటిని సరఫరా చేశారు. యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంఘాలు స్వాగత వేదికలు ఏర్పాటు చేసి మంచినీరు, మజ్జిగ, అన్నప్రసాద వితరణ చేశాయి. ఇదిలా ఉండగా పోలీసుల ఆంక్షల మధ్య గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ ఆధ్వర్యంలో గంగాబౌలి ఆకాశపురి హనుమాన్ టెంపుల్ వద్ద నుంచి మరో శోభాయాత్ర సాగింది.
సీతారాంబాగ్ నుంచి సుమారు 6.8 కిలోమీటర్ల మేర శ్రీరామ శోభాయాత్ర కొనసాగింది.. అలాగే భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన శోభాయాత్ర సీతారాంబాగ్ ఆలయంలో హోమం, ప్రత్యేక పూజల అనంతరం మొదలైంది. శ్రీరామ శోభాయాత్రలో భారీ హనుమంతుడు, భరత మాత, ఛత్రపతి శివాజీ విగ్రహాలు, ఒంటెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒగ్గు కళాకారులు తమదైన శైలిలో నృత్యాలు చేశారు.
శ్రీరామ భజనల మధ్య ధూల్ పేట్, జాలీ హనుమాన్, చుడీ బజార్, గౌలి గూడ మీదుగా హనుమాన్ టేక్డీ లోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘాతో పాటు మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారు.