పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దూకుడుగా వ్యవహరిస్తున్నారనే చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతోన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. అయితే తాజాగా కేంద్రమంత్రి, కిషన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో అత్యంత అట్టర్ ఫ్లాఫ్ మంత్రి అని విమర్శించారు..
హైదరాబాద్ (Hyderabad), యూసఫ్ గూడలో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్ష సమావేశం నేడు నిర్వహించారు. ఈ మీటింగ్కు హాజరైన కేటీఆర్.. అంబర్ పేటలో 2018లో ఓడిపోయిన సానుభూతితో గత పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలిచారని.. కానీ మరోసారి ఓటు అడిగే హక్కు ఆయనకు లేదని విమర్శించారు. సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్రమంత్రిగా ఐదు సంవత్సరాల్లో తన నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు.
మోడీ ప్రధాని అయిన తర్వాత దేశంలో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని తెలిపిన కేటీఆర్.. ఆయన ప్రధానమంత్రి కాదు పిరమైన మంత్రి అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా హైదరాబాద్లో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పై మండిపడ్డారు.. ఉచిత బస్సు పథకం రచ్చరచ్చ అయ్యిందని.. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆగమైపోయారని ఆరోపించారు.
బీజేపీని ఆపాలంటే ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమని స్పష్టం చేసిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి, కేసీఆర్ బొండిగ పిసికేస్తానని అంటే.. బండి సంజయ్ బీఆర్ఎస్ ను ఖతం చేయాలని అంటున్నారని మండిపడ్డారు.. హామీలను అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలకు కోపమొస్తుందని.. ఇందుకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు సరైన బుద్ధి చెప్పాలని కోరారు.. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనన్న కేటీఆర్. ఇద్దరూ కలిసి రాష్ట్రంలో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు..