Telugu News » KTR : కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కావు.. జనాన్ని మోసం చేశారు..!!

KTR : కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కావు.. జనాన్ని మోసం చేశారు..!!

నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపణలు చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ అధికారింలోకి వచ్చిన నెలరోజుల్లోనే తెలంగాణ అదానీ చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు..

by Venu

పార్లమెంటు ఎన్నికలే (Parliament Elections) లక్ష్యంగా బీఆర్ఎస్ (BRS) ముందుకు వెళ్తుంది. ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి.. పరువు నిలబెట్టుకోవాలనే తాపత్రయంలో ఉన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం పై గట్టిగానే ఫోకస్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నేడు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. కాంగ్రెస్ పై మండిపడ్డారు..

ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, డిప్యూటీ సీఎం తమ మేనిఫెస్టోలో ఈ అంశం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం అబద్ధం చెప్పారని కేటీఆర్ (KTR) సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో చెప్పేవి అబద్ధాలని రుజువు చేసేందుకు స్వేదపత్రం విడుదల చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ (Congress) ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని అన్నారు..

అధికారంలోకి రావాలనే ఆత్రంలో మొత్తం 420 హామీలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. దీనిని ఎండగట్టే బాధ్యత మనందరి మీద ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం తెచ్చుకోండి అని రేవంత్ మాట్లాడిన మాటలను కేటీఆర్ గుర్తుచేశారు. ఒక పక్క రాహుల్ గాంధీ, అదానీని విమర్శిస్తుంటే.. అదే రోజు అదానీతో.. రేవంత్ రెడ్డి భేటీ కావడం ఆశ్చర్యం కలిగిస్తోందని విమర్శించారు.

నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపణలు చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ అధికారింలోకి వచ్చిన నెలరోజుల్లోనే తెలంగాణ అదానీ చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు.. కేసీఆర్, హరీష్ రావు నాయకత్వంలో క్రియాశీలకంగా పని చేసి వచ్చే ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈసారి కూడా మెదక్‌లో బీఆర్ఎస్ జెండా ఎగరబోతోందని ధీమా వ్యక్తం చేశారు..

You may also like

Leave a Comment