Telugu News » KTR : రాసి పెట్టుకోండి.. మళ్లీ కేసీఆరే సీఎం!

KTR : రాసి పెట్టుకోండి.. మళ్లీ కేసీఆరే సీఎం!

ప్రతిపక్షాల తాపత్రయం రెండవ స్థానం కోసమేనని.. సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వకుంటే తమ దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయని సెటైర్లు వేశారు.

by admin
minister-ktr-intresting-comments-on-bjp-and-congress

అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ కి మరింత సానుకూల వాతావరణం ఏర్పడిందని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ప్రగతి భవన్ లో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 90 స్థానాలకు పైగా గెలుస్తామని.. కేసీఆర్ (KCR) మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు. క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ సమాచారం ప్రకారం కేసీఆరే సీఎంగా ఈ రాష్ట్రానికి ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.

minister-ktr-intresting-comments-on-bjp-and-congress

పది సంవత్సరాలల్లో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారన్న కేటీఆర్.. వారికి చాలా స్పష్టత ఉందని.. ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల తాపత్రయం రెండవ స్థానం కోసమేనని.. సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వకుంటే తమ దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయని సెటైర్లు వేశారు. తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఇచ్చారని తెలిపారు. 65 సంవత్సరాలలో ప్రతిపక్షాలు పెట్టిన మెడికల్ కాలేజీలు, కేవలం రెండు మాత్రమేనని.. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని ఆరోపించారు.

ఇతర రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత, నాయకత్వ లోపం తెలంగాణలో లేదన్న కేటీఆర్.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ అయితే.. ప్రతిపక్షాల అభ్యర్థి ఎవరో వారికే తెలియదని సెటైర్లు వేశారు. ‘‘ఢిల్లీ నుంచి వచ్చే సీల్డ్ కవర్లు, వారికి అందించే మూటలు మాత్రమే ప్రతిపక్షాల పరిస్థితి. ముఖ్యమంత్రులను మార్చడానికి మత కల్లోలాలను లేపి మరణహోమం సృష్టించి, మనుషులను చంపిన పార్టీ కాంగ్రెస్. తమ పార్టీ నాయకులపైనే చెప్పులు విసిరిన ఘనత కాంగ్రెస్ ది. ఈ రెండు పార్టీలు ఢిల్లీ బానిస పార్టీలు. ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరు. తెలంగాణ ప్రజలకు ఢిల్లీ బానిసలు కావాలో, తెలంగాణ బిడ్డ కావాలో తెలుసు. కేవీపీ రామచంద్రరావు, షర్మిల, తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారు. ఈరోజు వారు కాంగ్రెస్ ని గెలిపిస్తారంట. ఇంతటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టింది’’ అంటూ మండిపడ్డారు కేటీఆర్.

రాష్ట్రం కోసం ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టలేని కిషన్ రెడ్డి, ప్రజలపైన రైఫిల్ తీసుకువెళ్లిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముసుగులో జనంలోకి వస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వ్యతిరేకతను నరనరాన నింపుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ రామచందర్రావు, షర్మిల వంటి వారు ఏకమవుతున్నారని.. వీరందరితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పదేళ్లు సాధించిన అభివృద్ధిని, తెలంగాణ వ్యతిరేకుల చేతులు పెడదామా అనేది ఆలోచించాలన్నారు. పైకి కనబడేది కిషన్ రెడ్డి.. అదించేది కిరణ్ కుమార్ రెడ్డి.. పైకి కనబడేది రేవంత్ రెడ్డి.. ఆడించేది కేవీపీ రామచంద్రరావు అంటూ విమర్శించారు.

రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు తెలంగాణకు పట్టిన వ్యాధి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ నాయకులు ఒకరైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా.. ఒక్కరన్నా రాజీనామా చేశారా? అని అడిగారు. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చింది ప్రస్తుత బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది అంటే కూడా అంత దరిద్రంగా ఉంటుందన్నారు. నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలా? జీవితంలో వెలుగులు నింపిన భారత రాష్ట్ర సమితి కావాలా? అనేది ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎక్కడన్నా 4వేల రూపాయల పెన్షన్ ఇస్తుందా అని ప్రశ్నించారు కేటీఆర్. 55 సంవత్సరాలలో 200 దాటి పెన్షన్ ఇవ్వని వారు…. 4 వేలు అంటే ఎట్లా నమ్ముతామని అన్నారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాజెక్టు పైన కేసులు వేసి అడ్డంకులు సృష్టించిన పార్టీలు ఇప్పుడు ప్రారంభిస్తుంటే ప్రశ్నిస్తున్నాయని మండిపడ్డారు. 1963లో నెహ్రూ శంకుస్థాపన చేసిన ఎస్ఆర్ఎస్పీ కాలువను నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించలేదని అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించే ధైర్యం లేని పార్టీలు ఈరోజు తమ నాయకుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయని పైరయ్యారు.

ఇక తెలంగాణ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై ఆధారపడి ఉందన్నారు. షెడ్యూల్ ప్రకారం జరగాలంటే అక్టోబర్ 10 లోపు నోటిఫికేషన్ రావాలని.. ఆ లోపు నోటిఫికేషన్ వస్తేనే తెలంగాణ ఎన్నికలు జరుగుతాయన్నారు. లేదంటే ఏప్రిల్ లేదా మే నెలలో జరగొచ్చని అంచనా వేశారు. ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ అయిపోతేనే తెలంగాణ ఎన్నికలు నవంబర్ లేదా డిసెంబర్ లో జరుగుతాయా లేదా అనే క్లారిటీ వస్తుందని చెప్పారు. జమిలి ఎన్నిక అనేది తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రయత్నంలో భాగమేనని మోడీపై మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఒక అవగాహనలో ఉన్నాయని.. అందుకే బీజేపీని హస్తం నేతలు విమర్శించరని అన్నారు కేటీఆర్.

You may also like

Leave a Comment