తెలంగాణ (Telangana) గురుకుల విద్యా సంస్థల నియామక మండలి (TREI-RB) ఉద్యోగ నియామకాల్లో రీలింకిష్మెంట్ విధానం పాటించి.. అవరోహణ క్రమంలో భర్తీ చేయాలని బీఎస్పీ (BSP) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ (RS Praveen Kumar) కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ఎక్స్ (X) వేదికగా లేఖ రాశారు.
గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నియామకాలు కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం మిగిలిస్తున్నాయని అన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం గతేడాది గురుకుల బోర్డు డిగ్రీ లెక్చరర్స్, పీజీటీ, టీజీటీ వంటి అనేక ఉద్యోగ నియామకాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేసిందని గుర్తు చేసిన ప్రవీణ్కుమార్.. అర్హత కలిగిన వేలాది మంది నిరుద్యోగులు అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాశారని తెలిపారు.
కానీ బోర్డు వెల్లడించిన అన్ని ఫలితాల్లో ఒకే అభ్యర్థి.. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపికయ్యారని అన్నారు. అలా ఎంపికైన వారు ఏదో ఒక ఉద్యోగాన్ని ఎంచుకొని మిగతా ఉద్యోగాలు వదిలేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో అలా వదిలేసిన ఉద్యోగాలు ఖాళీగానే ఉండిపోతున్నాయి. దీంతో మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు తీరని నష్టం జరుగుతుందని వివరించారు.
ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బోర్డు తక్షణమే జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి అవరోహణ క్రమంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వీటి వల్ల సమయంతో పాటు.. నిరుద్యోగం కొంత వరకైనా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపారు.