Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతలు ప్రచారాలను ముమ్మరం చేశారు. ప్రచార సభల్లో హామీలను గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకాంగ్రెస్(T Congress) మరో సంచలన హామీ ప్రకటించింది. ధరణిలో ఉన్న లోపాలను సవరించి కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు.
పెద్దపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్బాబు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆలోచన విధానం మార్చే విధంగా కాంగ్రెస్ పార్టీపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూములు పోతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎవ్వరి భూమి ఎక్కడికి పోదని ధరణిలో లోపాలను సవరిస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ చెప్పుకోవడానికి పథకాలు ఏమీ లేక కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతి పాలనకు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అధినేత నోరువిప్పకపోవడం విడ్డూరమని శ్రీధర్బాబు విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటుకి ఇబ్బంది రాకుండా స్టేట్ గ్రిడ్ సెంట్రల్ గ్రిడ్ను అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభించిందని గుర్తుచేశారు. రైతులకు ఉచితంగా విద్యుత్తును అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు గంటల ఉచిత విద్యుత్ అందించిందని గుర్తు చేశారు. రైతులకు పారిశ్రామికవేత్తలకు కరెంటు సమస్యలు రాకూడదని భావించి జైపూర్ విద్యుత్ ప్లాంట్, భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్ విభజన చట్టంలో క్రిటికల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసినట్లు గుర్తుచేశారు.


