Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
తనది కాలేజ్ లైఫ్ అయితే ,సీఎమ్ జగన్ ది జైల్(Jail) లైఫ్ అని తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఎద్దేవా చేశారు. తనకు క్లాస్ మేట్స్ ఉంటే, జగన్ కు జైల్ మేట్స్ ఉన్నారని విమర్శించారు. తాను విదేశాలకు వెళ్లాలనుకుంటే తనకు ఎవరి పర్మిషన్ అవసరం లేదని, జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని లోకేష్ చెప్పారు.
తాడికొండ మండలం(Tadikonda Mandal) కంతేరో నారా లోకేశ్ 14 ఎకరాలు కొన్నారని ఆరోపించినందుకు వైసీపీ (YCP) నేతలపై కేసు వేసిన లోకేశ్..ఆ కేసుకు సబంధించిన వాంగ్మూలం ఇచ్చేందుకు లోకేశ్ మంగళగిరి (Mangalagiri) కోర్టుకు హాజరయ్యారు.
లోకేశ్ పై తప్పుడు ఆరోపణలు చేసిన పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)తో పాటు సింగలూరు శాంతిప్రసాద్ పై ఆయన కేసు వేశారు.పోసాని ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చలో సింగలూరు ప్రసాద్ కూడా ఇవే ఆరోపణలు చేశారు.
దీంతో వారిపై లోకేశ్ పరువునష్టం కేసులు వేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, వీరికి న్యాయస్థానం ద్వారా నోటీసులు పంపినా స్పందించలేదని అన్నారు. దీంతో తన పరువుకు భంగం కలిగించినందుకు కోర్టులో పరువునష్టం కేసు వేశానని చెప్పారు. కంతేరులో తనకు భూమి ఉన్నట్టు నిరూపించాలని సవాల్ విసిరారు.
అసత్య ఆరోపణలపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. తన పరువుకు నష్టం కలిగించినందుకు పోసాని రూ. 5 కోట్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేశానని, రాబోయే ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. మంగళగిరిలో గెలిచేది తానేనని ధీమా వ్యక్తం చేశారు.
ఓ ప్రముఖ ఛానల్ ప్రసారాలను ఏపీలో ఆపేశారని, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు. తాము అంబేద్కర్ (Ambedkar) రాజ్యాంగాన్ని నమ్ముకున్నామని, రాజారెడ్డి(Raja Reddy)రాజ్యాంగాన్ని కాదని చెప్పారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్షల కోట్లు దోపిడీ చేశారని లోకేశ్ ఆరోపించారు. తన తాత, తండ్రి ఇద్దరూ ముఖ్యమంత్రులైనప్పటికీ తాను ఏనాడూ అవినీతికి పాల్పడలేదని చెప్పారు.
ఏపీలో సైకో పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే అని… 2024 నుంచి 2029 వరకు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.



