ఏఐఎంఐఎం (AIMIM) మరో రెండు నియోజక వర్గాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఆ నియోజక వర్గాల్లో బలమైన నేతలను బరిలో దింపాలని వ్యూహాలు రచిస్తున్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ (Jubilee Hills), రాజేంద్ర నగర్ (Rajendra Nagar) స్థానాల్లో ఈ సారి తమ అభ్యర్థులను బరిలో దించేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఈ రెండు నియోజక వర్గాల్లో పార్టీకి బలమైన పట్టు ఉండటంతో పార్టీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇది ఇలా వుంటే ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి 365 రోజులు తమ పార్టీ నేతలు ప్రజల మధ్యే ఉంటారని చెప్పారు. అదే తమ ఎజెండా మేనిఫెస్టో అని వెల్లడించారు. పాతబస్తీలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా తమ నేతలు ప్రజలకు అందుబాటులో వుంటారని ఆయన వెల్లడించారు.
చిన్న గల్లీ స్థాయి నేత మొదలు ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు అందరూ వెళ్లి ప్రజా కార్యక్రమాలకు హాజరవుతారన్నారు. ప్రజలు తమను పిలవడమే ఆలస్యం వెంటనే అక్కడ వాలిపోతామన్నారు. వివాహ వేడుకలకు పిలిచినా, పిలవక పోయినా తమ నేతలు వెళ్లి వధూవరులను ఆశీర్వదిస్తుంటారన్నారు. అదే తమ మొదటి హామీగా తెలిపారు.
తమ పార్టీ కౌన్సిలర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా పార్టీ కార్యాలయంలో నేరుగా ప్రజలను కలుస్తారని చెప్పారు.అదే తమ మెనిఫెస్టోలో ప్రధాన అంశమని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తమ నేతలు వెంటనే అక్కడికి చేరుకుని వాళ్ల సమస్యలు పరిష్కరించి, ఆదుకుంటారని పేర్కొన్నారు. తాము ఏది చెబుతామో అదే చేస్తామని, ఏది చేస్తామో అదే చెబుతామన్నారు.