తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంపై.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ (BRS) నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) సంచలన వ్యాఖ్యలు చేశారు.

అదీగాక బేగంపేట విమానాశ్రయంలో ఇటీవల కలుసుకొన్న గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య రెండు గంటల పాటు చర్చ జరిగిందని ఆరోపించారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత చంద్రబాబు ఆయన అనుచరులను బీజేపీలోకి పంపించారని ఆరోపించిన బాల్క సుమన్.. రేవంత్ ను సైతం బీజేపీలోకి పంపించేందుకు రెడీగా ఉన్నాడని విమర్శించారు.
రేవంత్ రెడ్డి మా శిష్యుడేనని.. మీరూ ఒకే అంటే బీజేపీలోకి తీసుకుని వస్తానని చంద్రబాబు, మోడీకి హామీ ఇచ్చాడని ఎద్దేవా చేశారు. గురు శిష్యుల బంధం బీజేపీ కోసం కృషి చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో మీకూ పెను ప్రమాదం చోటు చేసుకోబోతోందని, కాంగ్రెస్ సీనియర్ నేతలకు హెచ్చరించాడు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని పేర్కొన్నారు..