Telugu News » Bihar : ఎన్నికల వేళ ఈడీ వేడి.. లాలూ ముఖ్య అనుచరుడు అరెస్టు..!

Bihar : ఎన్నికల వేళ ఈడీ వేడి.. లాలూ ముఖ్య అనుచరుడు అరెస్టు..!

సుభాష్‌ యాదవ్‌కు చెందిన కంపెనీపై కేసు నమోదైంది. ఈ కేసులో పలువురిని ఇప్పటికే ఈడీ అరెస్టు చేసింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో ఆర్జేడీ నేతలపై ఈడీ రెయిడ్స్ జరగడం ఆసక్తికరంగా మారింది.

by Venu

ఒకవైపు లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్నాయి.. దీంతో పొలిటికల్ హిట్ పెరిగింది. వివిధ పార్టీలు ఎన్నికలకు సమయాత్తం అవుతున్నాయి. ఇదే సమయంలో ఈడీ (ED) సైతం దూకుడు పెంచింది. ఈ క్రమంలో బీహార్ (Bihar)లో, ఆర్జేడీ (RJD) పార్టీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ముఖ్య అనుచరుడు, ఇసుక మైనింగ్‌ వ్యాపారి సుభాష్‌యాదవ్‌ను నిన్న రాత్రి అరెస్టు చేసింది.

మనీలాండరింగ్‌ కేసులో శనివారం తెల్లవారుజాము నుంచే సుభాష్‌ యాదవ్‌ (Subhash Yadav)కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈడీ రెయిడ్స్ ముగిసిన తర్వాత సుభాష్‌ను అధికారులు అరెస్టు చేశారు. కాగా ఈ సోదాల్లో రూ.2.30 కోట్ల నగదుతో పాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గతంలో ఇసుక అక్రమ మైనింగ్‌, అమ్మకాల ద్వారా ఆయన రూ.161 కోట్లు ఆర్జించినట్లు ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలో సుభాష్‌ యాదవ్‌కు చెందిన కంపెనీపై కేసు నమోదైంది. ఈ కేసులో పలువురిని ఇప్పటికే ఈడీ అరెస్టు చేసింది. ఇదిలా ఉండగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో, ఆర్జేడీ టికెట్‌పై జార్ఖండ్‌లోని ఛాత్రా లోక్‌సభ స్థానం నుంచి సుభాష్‌ యాదవ్‌ పోటీ చేశారు. అయితే రాష్ట్రంలో ఆర్జేడీతో సంకీర్ణాన్ని వీడిన సీఎం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ పార్టీ.. ఇటీవలే బీజేపీతో జట్టుకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్జేడీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో ఆర్జేడీ నేతలపై ఈడీ రెయిడ్స్ జరగడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాజకీయ వర్గాలలో సైతం ఈ వార్తలు చర్చనీయాంశమయ్యాయి.

You may also like

Leave a Comment