Telugu News » ప్రభుత్వ అధికారులే లక్ష్యంగా.. ఓ జయగాడి దండయాత్ర..!

ప్రభుత్వ అధికారులే లక్ష్యంగా.. ఓ జయగాడి దండయాత్ర..!

by admin
Inspired by Suriya's film 'Gang', man turns ACB cop

మనిషి దిట్టంగా బానే ఉంటాడు. కాస్త గట్టిగా ట్రై చేస్తే ఎస్సై అయిపోయేవాడు. కానీ, గొలుసు దొంగతనం చేసి ఖైదీ అయిపోయాడు. అక్కడి నుంచి అతని క్రైమ్ స్టోరీ మొదలైంది. ఎంతగా మారిపోయాడంటే హైదరాబాద్ లో ఉదయం ఏసీ బస్ ఎక్కుతాడు.. డబ్బులొచ్చే శాఖల అధికారులకు సరదాగా ఫోన్ చేస్తాడు. మాట్లాడ్డం మొదలు పెడితే అవతలి వాళ్ల వెన్నుపాము జర్రున జారిపోతుంది. వెంటనే, వానపాములైపోతారు. అడిగినంత డబ్బులు వేసేస్తారు. ఇతను పరిచయం చేసుకునే ఉద్యోగం పేరు ఏసీబీ.

Inspired by Suriya's film 'Gang', man turns ACB cop

ఈ కేటుగాడి పేరు జయకృష్ణ అలియాస్ జయ. ఇత‌డి జైత్రయాత్రలో బలైన గవర్నమెంట్ అధికారుల సంఖ్య 200. అంటే మనోడు ఏం రేంజ్ నేరగాడో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొట్టలపల్లికి చెందిన నూతేటి జయకృష్ణ.. 2017లో అనంతపురంలో సేల్స్‌ మెన్‌గా పని చేస్తూ సబ్‌ ఇన్ స్పెక్టర్‌ ఉద్యోగానికి సన్నద్ధమయ్యాడు. త‌ర్వాత జల్సాలకు అలవాటుపడి అదే ఏడాది అనంతపురంలో తొలిసారి గొలుసు దొంగతనం చేసి ఐదు రోజులు జైలుకెళ్లాడు. అక్కడ అనిల్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. బెయిల్ పై బయటికొచ్చాక హైదరాబాద్ కు వచ్చి మరోసారి ఎస్సై ప్రిప‌రేష‌న్ కు సన్నద్ధమయ్యాడు. ఈ టైమ్ లోనే సూర్య నటించిన గ్యాంగ్‌ సినిమాతో ప్రభావితమై శ్రీనాథ్ అనే మరో వ్యక్తితో కలిసి నకిలీ ఏసీబీ అధికారి అవతారమెత్తాడు. అదే క్యారెక్టర్ లో ఇమిడిపోయి ఓ అధికారికి ఫోన్‌ చేసి డబ్బులు వసూలు చేసి జైలుకెళ్లాడు. బెయిల్ మీద బయటకొచ్చిన జయకృష్ణ అలవాటు పడ్డ మార్గంలోనే నడిచాడు.

కాలేజీ స్నేహితులు రాఘవేంద్ర, రామచంద్రతో కలిసి పట్టణంలో 16 గొలుసులు దొంగిలించారు. ఆ తర్వాత జైల్లో పరిచయమైన సాల్మన్‌ రాజ్, సాయికుమార్, గంగయ్యతో కలిసి అనేక నేరాలు చేశాడు. 2019 నుంచి 2022 మధ్య కర్నూలు, పులివెందుల, అనంతపురం, మచిలీపట్నం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మున్సిపల్, రవాణా, పౌర సరఫరా శాఖల అధికారులకు ఏసీబీ అధికారినంటూ డబ్బు వసూలు చేశాడు. ఇలా ఆంధ్రప్రదేశ్ లోనే ఇత‌నిపై 32 కేసులు నమోదయ్యాయి. ఏపీలో తెరదించిన ఇతడి కన్ను తెలంగాణపై పడింది. ఇక్కడా మోసాలు చేసేందుకు బెంగళూరుకు మకాం మార్చాడు. బెంగళూరులో కొందరితో పరిచయం పెంచుకున్న జయకృష్ణ వారి బ్యాంకు ఖాతాలు సేకరించాడు. దాదాపు 150 ప్రీ యాక్టివేటెడ్‌ సిమ్ కార్డులు దొడ్డిదారిలో సంపాదించాడు. గతేడాది ఆగస్టు నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాల అధికారుల ఫోన్‌ నెంబర్లను ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి సేకరించి.. తనకు డబ్బు అవసరమైన ప్రతీసారి అధికారుల్ని ఎంచుకుని ఫోన్‌ చేసేవాడు.

హైదరాబాద్‌ సహా 15 జిల్లాలకు చెందిన నీటి పారుదల, విద్యుత్తు, విద్య, సాంఘిక సంక్షేమం, రెవెన్యూ, పంచాయతీరాజ్, మార్క్‌ ఫెడ్, పౌర సరఫరాల శాఖలకు చెందిన దాదాపు 200 మంది అధికారుల నుంచి గతేడాది ఆగస్టు నుంచి మొత్తం రూ.70 లక్షల వరకు వసూలు చేశాడు. ఈ ఏడాది జూన్ లో సిద్దిపేట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి ఫోన్‌ చేసి రూ.3 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడు. శంషాబాద్ లోనూ ఓ అధికారిని బెదిరించాడు. ఈ వ్యవహారంపై దృష్టిపెట్టిన శంషాబాద్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ టీం.. ఫోన్‌ నెంబర్ల ఆధారంగా నిందితుడు బెంగళూరులో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఇదే స‌మ‌యంలో నిందితుడు హైదరాబాద్ కు ఏదో ప‌ని మీద వచ్చాడు. ఇదే అదనుగా పోలీసులు ప‌క్కా ప్లాన్ తో అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుడి దందాపై పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నిందితుడు బెంగళూరులో ఉండే సమయంలో తన ఆచూకీ పోలీసులకు అంతుబట్టకుండా కొత్త పథకం వేశాడు. అధికారులకు ఫోన్‌ చేసి బెదిరించాలనుకుంటే ఉదయం 11 గంటలకు స్థానికంగా ఏసీ బస్సు ఎక్కేవాడు. అందులో ప్రయాణిస్తూ అందరికీ ఫోన్ చేసి డబ్బులు అడిగేవాడు. ఆ తర్వాత ఫోన్‌ స్విచాఫ్‌ చేసేవాడు. పోలీసులకు సెల్‌ టవర్‌ ఆచూకీ చిక్కకుండా ఇలా చేసేవాడు. ఏసీబీ అధికారినంటూ మాట్లాడే సమయంలో మిమిక్రీ చేసి ఇన్ స్పెక్టర్, డీఎస్పీనంటూ రెండు గొంతులతో మాట్లాడటం నిందితుని ప్రత్యేకత. మొదట హైదరాబాద్‌ నుంచి ఏసీబీ అధికారినంటూ మొదలెడతాడు. అవతలి వాళ్లు వింటే సరి లేదంటే తమ డీఎస్పీతో మాట్లాడాలంటూ స్వరం మారుస్తాడు, తన అలవాటు వార్నింగ్ వర్డింగ్ వాడుతుండేవాడు. అంతే.. తన అకౌంట్ కి టింగ్ మని మెసేజ్ వస్తుంది. అడిగినంత అమౌంట్ మెసేజ్ లో కనిపిస్తుంది. తర్వాత ఆ సిమ్ చెత్త బుట్టలోకి పోతుంది. ఇలా వసూలు చేసిన డబ్బుతో గోవాలో జల్సా చేస్తాడు. రోజుకు రూ.లక్షకు పైగా ఖర్చు చేసి క్యాసినోలు ఆడతాడు. నిందితుడి నుంచి 85 వేల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.2.24 లక్షలు, 5 సిమ్ కార్డులు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

You may also like

Leave a Comment