బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బడ్జెట్ (Budget)పై తీవ్ర విమర్శలు చేశారు. వ్యవసాయానికి రూ.19,746 కోట్లు మాత్రమే కేటాయించారని, మరి రైతు భరోసా, రుణమాఫీ, పంట బీమా, రైతు బీమా, వడ్డీ లేని పంటరుణాలు, విత్తనాభివృద్ధి పరిస్థితేంటని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన మాటల గారడీ అయితే.. కాంగ్రెస్ పాలన అంకెల గారడీ అని మండిపడ్డారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు తప్ప.. ఎన్నికల వాగ్ధానాల కోసం చెప్పిందేమీ లేదన్నారు.
రైతు కూలీలకు భరోసా ఇచ్చిన కాంగ్రెస్ హామీలు నీటిమీద రాతలేనా? అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటుతున్నా, పనులు కనీసం పార్టీ కార్యాలయం కూడా దాటి రావట్లేదని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ప్రజలను విభజించి పాలిస్తోందని కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. సికింద్రాబాద్ (Secunderabad)లో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. రామ్ గోపాల్ పేట్ ప్రభుత్వ పాఠశాలలో పవర్ బోర్ వెల్ను ప్రారంభించారు.
అనంతరం మాట్లాడిన కిషన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా రంగానికి అరకొర నిధులు కేటాయించారని మండిపడ్డారు. పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ముఖ్యంగా విద్యారంగానికి అరకొర నిధులను కేటాయించిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, మౌలిక వసతుల పెంపు అంశంపై కేటాయించిన నిధులు సరిపోవని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీల కోసం హాస్టల్ మంజూరు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నాయని దుయ్యబట్టారు..
అంతకుముందు నల్గొండ (Nalgonda) జిల్లాలోని అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆ ఆలయంలో ఏకశిలా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నో పోరాటాలు, కేసుల ఫలితంగా చాలా ఏళ్ల తర్వాత అభయాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నెరవేరిందని కిషన్ రెడ్డి అన్నారు. అందుకోసం నిరంతరం కృషి చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు.