Telugu News » Ram Nath Kovind : సిద్దమైన జమిలి ఎన్నికల నివేదిక.. రాష్ట్రపతికి అందించిన మాజీ రాష్ట్రపతి కమిటీ..!

Ram Nath Kovind : సిద్దమైన జమిలి ఎన్నికల నివేదిక.. రాష్ట్రపతికి అందించిన మాజీ రాష్ట్రపతి కమిటీ..!

మూడుస్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా కూడా ఉండాలని వెల్లడించింది. మరోవైపు దాదాపు 190 రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం జరిపింది.

by Venu

దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ram Nath Kovind) నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది. ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu)కు నేడు సమర్పించింది. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు నినాదంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్న కేంద్ర నిర్ణయంలోని సాధ్యాసాధ్యాలపై 18,629 పేజీల నివేదికను రాష్ట్రపతికి అందజేశారు.

ఈ ఉదయం కోవింద్ సహా కమిటీ సభ్యులు రాష్ట్రపతి భవన్‌ వెళ్ళి.. జమిలి ఎన్నికల (Jamili Elections)పై తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. రెండంచెల విధానాన్ని సూచించింది. తొలుత, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్‌ నిర్వహించాలని పేర్కొంది. ఆ తర్వాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో పేర్కొంది. ఇందుకోసం రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాలని కమిటీ సూచించింది.

ఇక, మూడుస్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా కూడా ఉండాలని వెల్లడించింది. మరోవైపు దాదాపు 190 రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలో 47 రాజకీయ పార్టీలు ఈ అంశంపై తమ అభిప్రాయాలు తెలిపాయి. కాగా ఇందులో 32 పార్టీలు జమిలికి మద్దతిచ్చాయి. ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు, సూచనలు కోరగా.. 21,558 స్పందనలు వచ్చాయి.

వీరిలో 80శాతం మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు. ఇవన్నీ అధ్యయనం చేసిన అనంతరం కమిటీ ఈ నివేదిక రూపొందించింది. ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా ఏకకాల ఎన్నికల నిర్వహణపై మోడీ సర్కార్ 2023 సెప్టెంబరులో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను (Ramnath Kovind) నియమించింది.

కమిటీలో సభ్యులుగా కేంద్ర మంత్రి అమిత్‌షా, విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీలను చేర్చింది. కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ను ప్రత్యేక ఆహ్వానితుడిగా, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్‌ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది.

అదేవిధంగా ఈ అంశంపై లా కమిషన్‌ కూడా తమ నివేదికను దాదాపు సిద్ధం చేసినట్లు తెలిసింది. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని చేర్చాలని లా కమిషన్‌ సూచించే అవకాశం ఉందని సమాచారం. కాగా 2029 నాటికి ఏకకాల ఎన్నికల నిర్వహణ జరిగేలా చూడాలనే ప్లాన్ లో లా కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment