– బీఆర్ఎస్ నేతల అవినీతిపై కాంగ్రెస్ యాక్షన్
– పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఉంటుందా?
– ప్రస్తుతానికి లీకులతో లబ్ధి
– ఇప్పటికే పలువురిపై కేసులు, నోటీసులు
– ఎన్నికల తర్వాతే అవినీతి లెక్కలు
– రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ
రేవంత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందు రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతిపై ఎన్నో ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక బాగోతాలన్నీ బట్టబయలు చేస్తానని శపథం చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం చర్యలకు ఉపక్రమించిన కాంగ్రెస్ సర్కార్.. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదికను లీక్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించాలనే భావనలో ఉండడంతో గులాబీ నేతల అవినీతిని క్రమంగా బయట పెడుతోంది. కేసులు, చర్యల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది.

ఇప్పటికే గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకల యవ్వారంలో నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పీఎస్ గా వ్యవహరించిన కల్యాణ్ పై కేసు నమోదైంది. ఇందులో తలసాని పేరు సైతం వినిపిస్తోంది. ఫార్ములా ఈ- రేస్ కు ఎలాంటి ఆదేశాలు లేకుండా అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ రూ.55 కోట్లు ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేసిన అంశంపై షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఇందులో సైతం అవినీతి బయటపడటంతో ఆ రూ.55 కోట్లు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం అరవింద్ కుమార్ కు తేల్చి చెప్పగా.. తాను కేటీఆర్ చెప్పినట్లే చేశానన్నట్లు ఆయన అంటున్నారు.
ఇక, భూ కబ్జా కేసులో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో పాటు యాదాద్రి పవర్ ప్లాంట్ పై విచారణకు ఆదేశించాలని ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ఇలా ఒకటేమిటి పదేళ్ళ పాలనలో దిద్దుకోలేని తప్పులెన్నో చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఒకరిద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని ప్రచారం మొదలైంది. అయితే.. కాంగ్రెస్ పై బ్యాడ్ నేమ్ రాకుండా.. జాగ్రత్తగా డీల్ చేయాలన్న దానిపై నేతలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకే, లోక్ సభ ఎన్నికల తర్వాత అసలు కథ మొదలవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.