తెలంగాణ (Telangana) ప్రభుత్వం పాత డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నేడు కొత్తగా 11,062 టీచర్ పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ను విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరైయ్యారు.. అయితే ఇదివరకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని విద్యాశాఖ ప్రకటించింది.

ఇదిలా ఉండగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న విడుదల చేయాలని అధికారులు భావించారు. కానీ షెడ్యూల్ ఖరారు, సాఫ్ట్వేర్ డిజైన్ తుది మెరుగులు దిద్దాల్సి కారణంగా వాయిదా పడింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ (Notification)పై ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు. ఇప్పటికే 4 లక్షల మంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)లో ఉత్తీర్ణులయ్యారు. వారంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాల నుంచి ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించుకోవాలని భావించడం వల్ల.. సాఫ్ట్ వేర్ రూపకల్పనపై మరింత శ్రద్ధ వహిస్తున్నారని తెలుస్తోంది. ఈమేరకు పాస్వర్డ్లు మరియు ఆన్లైన్ సిస్టమ్ భద్రతను సీనియర్ అధికారులు సమీక్షిస్తారు. ఇక ప్రైవేటు కంపెనీల పాత్ర సాంకేతిక రంగంలో ఉన్నందున, ఉన్నతాధికారులు విద్యాశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.