Telugu News » Telangana : తెలంగాణ కాంగ్రెస్ లో విషాదం.. మరణించిన సీనియర్ నేత మాజీ మంత్రి..!!

Telangana : తెలంగాణ కాంగ్రెస్ లో విషాదం.. మరణించిన సీనియర్ నేత మాజీ మంత్రి..!!

చిన్న తనంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పని చేశారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ (Hyderabad)ను, విముక్తి చేసే పోరాటంలో సైతం పాల్గొన్నారు. 1971 నుంచి 1972 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా సేవలందించారు.

by Venu

తెలంగాణ కాంగ్రెస్ లో విషాదం చోటు చేసుకొంది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి (92) కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తెల్లవారుజామున మరణించారు. హైదరాబాద్‌ (Hyderabad), బంజారాహిల్స్ (Banjara Hills) రోడ్ నెంబర్ 12లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

నర్సారెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆయన మృతిపట్ల సంతాపం తెలియచేసారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిర్మల్ (Nirmal) జిల్లా, మలక్ చించోలి గ్రామానికి చెందిన నర్సారెడ్డి కాంగ్రెస్‌లో అంచెలచెంలుగా ఎదిగి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా పని చేశారు. జలగం వెంగళరావు కేబినెట్‌లో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు.. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివిధ హోదాల్లో సేవలు అందించారు.

నర్సారెడ్డి 1931, సెప్టెంబర్ 22న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో B.A, L.L.B పట్టాలు పొందిన ఆయన.. చిన్న తనంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పని చేశారు. నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ (Hyderabad)ను, విముక్తి చేసే పోరాటంలో సైతం పాల్గొన్నారు. 1971 నుంచి 1972 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా సేవలందించారు.

1978లో అప్పటి సీఎం జలగం వెంగళరావు మంత్రివర్గంలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ మరియు శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. 1967 నుంచి 1982 వరకు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 1991లో ఆదిలాబాద్ ఎంపీగా, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా కొనసాగారు. అనంతరం క్రమంగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.

You may also like

Leave a Comment