Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
మహబూబ్ నగర్ (Mahbub Nagar) జిల్లా జడ్చర్ల (Jadcherla) ప్రజా ఆశీర్వాద సభ (Praja Ashirwada Sabha)లో సీఎం కేసీఆర్ (CM KCR) కీలక వ్యాఖ్యలు చేశారు.. ముఖ్యంగా కాంగ్రెస్ (Congress) పార్టీ టార్గెట్ గా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ చేసిన పొరపాటు వల్ల 60 ఏళ్లు ఎంతో గోసపడ్డామని అన్నారు. తెలంగాణను ఎవరూ ఇవ్వలేదు, పోరాటం చేసి సాధించామని గుర్తు చేశారు. చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించానని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడే సాధించానని వెల్లడించారు.. పాలమూరును దత్తత తీసుకొన్న కొందరు పాలకులు చేసిందేమీ లేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కులం, మతం తేడా లేకుండా ప్రతి వర్గాల వారికి ఇస్తున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. దేశానికి రైతుబంధు పథకం తాను తీసుకొచ్చే వరకు తెలియదని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు రైతులకు రూ.37,000 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశామన్న కేసీఆర్ వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవని తెలిపారు. కృష్ణా జలాల్లో మన హక్కు సాధించడం కోసం ఎంతో పోరాటం చేశానని కేసీఆర్ తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు (Palamuru-Ranga Reddy project) జూరాల నుంచి జలాలు తీసుకోవాలని కొందరు చెప్పారని.. 9 టీఎంసీల సామర్థ్యం గల జూరాల నుంచి నీరు తీసుకుంటే మనకు సరిపోతాయా అని ప్రశ్నించారు.
పాలమూరు కరవు త్వరలో పూర్తిగా పోతుందని, రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని కేసీఆర్ వెల్లడించారు. లక్షన్నర ఎకరాలకు కృష్ణా జలాలు 14 నెలల్లో అందుతాయని చెప్పారు. పారిశ్రామిక, ఐటీ రంగానికి కేంద్రంగా జడ్చర్లను తీర్చిదిద్దుతామని అన్నారు. ఒకప్పుడు దుమ్మురేగే దుందుభి నది ఇప్పుడు జీవధారగా మారిందని కేసీఆర్ వివరించారు.
మరోవైపు మూడోసారి హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు పెంచారని అంతా అనుకొంటున్నారు. పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. బుధవారం జడ్చర్లలో తలపెట్టిన బహిరంగ సభలో ఏ మాత్రం జోష్ తగ్గకుండా ప్రసంగించారు.






