Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu)పై బెజవాడ ఎంపీ, వైసీపీ అభ్యర్థి కేశినేని నాని (Kesineni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. శవ రాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. విజయవాడ(Vijayawada)లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులతో కలిసి క్రిస్తురాజపురం, పెద్ద బావి సెంటర్లో తూర్పు నియోజకవర్గ జోనల్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పింఛన్ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు, సామాన్యులకు వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇస్తుంటే చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన 2024 ఎన్నికలు ముగిశాక చంద్రబాబు సొంతరాష్ట్రమైన తెలంగాణకు పారిపోతాడని ఎద్దేవా చేశారు.
కుట్ర రాజకీయాలు, నీచ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపట్టిన నాయకుడు దేవినేని అవినాష్కు అభినందనలు తెలిపారు. లక్షమందికి రక్షణగా రక్షణ గోడ కట్టించిన ఘనత అవినాష్కే దక్కుతుందన్నారు. సీఎం జగన్తో మాట్లాడి అభివృద్ధి పనులకు రూ.650కోట్లు మంజూ చేయించారని తెలిపారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ అందిస్తున్న పథకాలు, అభివృద్ధి పనులకు అందిస్తున్న నిధులతోనే ముందుకెళ్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జోనల్ కార్యాలయాలు ప్రారంభించి ప్రజలతో మమేకమవుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా భారీ మెజార్టీతో సీట్లు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు.