పాడి ఉత్పత్తి తెలంగాణ ప్రజలకు ఒక సంపద లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో ఇవాళ(సోమవారం) జరిగిన 50వ పాడిపరిశ్రమ సదస్సు-2024(Dairy Conference-2024)ను జ్యోతి ప్రజ్వలన చేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao)తో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో డెయిరీ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో పాడి ఉత్పత్తి ఒక భాగమన్నారు. పాలు పొంగించి శుభాలు పొందాలన్నారు. పాలు ఉన్న చోట సంపద ఉంటుందని తెలిపారు. తెలంగాణలో పాడి ఉత్పత్తికి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదని తెలిపారు.
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి నేతృత్వంలో దేశంలో హరిత, శ్వేత విప్లవానికి పునాదులు వేశారని గుర్తు చేశారు. దేశంలో పాడి పరిశ్రమ్ బాటలు వేశారని తెలిపారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ ఈ వార్షిక బడ్జెట్లో పెద్దపీట వేశామన్నారు.
రీజినల్ రింగ్ రోడ్ – ఔటర్ రింగ్ రోడ్డు మధ్యన డెయిరీ ఇండస్ట్రీ క్లస్టర్స్ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇందిరా క్రాంతి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డెయిరీ పరిశ్రమ అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. స్వయం సహాయక సంఘంలో ఉన్నమహిళలకు పాడి ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయడానికి ఆర్థికంగా ప్రోత్సాహిస్తున్నామన్నారు.