ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా మాదకద్రవ్యాల సరఫరా మాత్రం ఆగడంలేదు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. తాజాగా కేపీహెచ్బీ(KPHB) పోలీస్స్టేషన్ పరిధిలోని హాస్టళ్ల(Hostels)లో గంజాయి పట్టుబడింది.
సైబరాబాద్ ఎస్వోటీ(Cyberabad SOT) అధికారులు రెండు చోట్ల తనిఖీలు నిర్వహించి 1.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నందిగామ సాయి తేజ, కొత్తపల్లి నాగ శ్రీనివాస్ అనే ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వీరిలో సాయితేజ పాత నేరస్థుడిగా గుర్తించారు.
ఆ ఇద్దరు యువకులు ఉంటున్న రూం నంబర్ 301 నుంచి అమ్మకానికి సిద్ధం చేసిన 750 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని కేపీహెచ్బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, కుత్బుల్లాపూర్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కైసర్ నగర్లో మేడ్చల్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా గంజాయి విక్రయిస్తున్న బ్రిజేష్ కుమార్ పాండే(30) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 650 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.