తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాబోయే ఎంపీ ఎన్నికల్లో సైతం మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని ఆరాటపడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే పార్టీ అధిష్టానం వ్యూహాలు రచించడంలో నిమగ్నమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో డిక్లరేషన్లను చేర్చినట్టే, పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) సైతం గత ప్రభుత్వ తప్పిదాలు, కొత్త సర్కార్ చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాలని ఇటీవల జరిగిన ఇంటర్నల్ మీటింగ్ లో టీపీసీసీ తీర్మానించినట్లు సమాచారం.
ఇందుకోసం కసరత్తులు మొదలుపెట్టిన కాంగ్రెస్ (Congress).. గత ప్రభుత్వ పదేళ్ల పాలన, రెండు నెలల్లో కాంగ్రెస్ ప్రజా పాలన అనే స్లోగన్ను వెపన్ లా వాడుకొని రాష్ట్రమంతటా విస్తృతంగా వ్యాప్తి చేయాలని ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. హోర్డింగ్లు, ప్లెక్సీలను ఉపయోగించుకొని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పరిపాలనలపై వివరాలతో సహా ప్రజలకు తెలియజేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
జన సామూహిక ప్రదేశాలతో పాటు ఇంటింటికీ కరపత్రాలను కూడా అందచేయాలని ఆలోచనలో హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఏఐసీసీ, టీపీసీసీ, కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ భాగస్వామ్యం కానున్నాయి. ఈ ప్రచారాస్త్రాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకువెళ్తే, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లుకు మార్గం క్లియర్ అవుతుందనే భావనలో పార్టీ కీలక నేతలున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన పనులతో పాటు.. బీఆర్ఎస్ (BRS) పదేళ్ల పాలనలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఫెయిల్, పేపర్ లీకేజీలు, రైతుల సమస్యల పరిష్కారంలో విఫలం అంటూ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో హస్తం నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అవసరం కంటే ఎక్కువగా అప్పులు తీసుకున్నారని, కాళేశ్వరంలో అవినీతి, సివిల్ సప్లయి, విద్యుత్, ఎడ్యుకేషన్లో వైఫల్యం, టీఎస్పీఎస్సీ (TSPSC) బోర్డు నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగుల జీవితాలు ఆగమమైన అంశాన్ని ప్రచార అస్త్రంగా వాడాలనే ఆలోచనలో నేతలున్నట్లు టాక్..
వీటికి తోడు నిర్బంధ పాలన, ప్రజాసంఘాలు, మీడియా గొంతు నొక్కడం, పేదలను కాదని కార్పొరేట్లకు పెద్దపీట వేయడం, అక్రమంగా ఔటర్ రింగ్ రోడ్డు, విచ్చల విడిగా మాదకద్రవ్యాల విక్రయం.. వీటిపై పై నియంత్రణ లేకుండా చేయడం, ఇష్టారీతిలో మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులు, కబ్జాలు, గడీల పాలన, రైతులకు బేడీలు, నేరెళ్ల ఇసుక మాఫియా హత్యలు వంటి తదితర అంశాలను జనాల్లోకి బలంగా తీసుకెళ్లనున్నట్లు సమాచారం.