Latest Breaking news in telugu, happening around the world, india and telangana, a.p.
మనిషి జీవనానికి అనుగుణంగా ప్రకృతి ఏర్పడింది.. కానీ ఆశల జలపాతంలో తడిసిపోతున్న మానవుడు.. తనకు అనుగుణంగా ప్రకృతిని మార్చడం ప్రారంభించాడు.. అప్పటి నుంచి ప్రకృతి (Nature)లో మార్పులు జరగడం అందరూ గమనిస్తున్న అంశం.. ఈ క్రమంలో ముందు తరాల భవిష్యత్తుకు ప్రమాదం ఉందనే నిజాన్ని ఇప్పటికే శాస్త్రవేత్తలు (Scientists) హెచ్చరికల రూపంలో చేరవేస్తున్నారు..
పలు అధ్యయనాలు సైతం ఇదే నిజాన్ని వెల్లడిస్తున్నాయి.. ఆధునికత పేరుతో ప్రకృతిని ధ్వంసం చేస్తున్న మనిషి ముందు ముందు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే సూచనలు ఇప్పటికే ప్రకృతి అందించడం మొదలుపెట్టినట్లు కొన్ని సంఘటనలు నిరూపించడం కనిపిస్తోంది. ఇదే సమయంలో గ్లోబల్ వార్మింగ్ మరో 3 డిగ్రీలు పెరిగితే హిమాలయ ప్రాంతంలోని దాదాపు 90 శాతం.. ఏడాదిపాటు తీవ్ర కరవులో కూరుకుపోతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.
ఇదిలా ఉండగా ఇంగ్లండ్ (England)లోని ఈస్ట్ అంగ్లియా యూనివర్సిటీ (East Anglia University) నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు ‘క్లైమేట్ చేంజ్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ను పారిస్ ఒప్పంద లక్ష్యాలకు అనుగుణంగా 1.5 డిగ్రీలకు పరిమితం చేయగలిగితే దేశంలోని 80 శాతం ప్రజలు వేడికి గురికాకుండా నివారించే అవకాశం ఉందని ఈ అధ్యయనం పేర్కొంది.
మరోవైపు గ్లోబల్ వార్మింగ్ (Global warming) స్థాయి పెరిగే కొద్దీ మానవ, సహజ వ్యవస్థలు ప్రమాదంలో పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదీగాక వాతావరణ మార్పుల ప్రమాదాలు జాతీయస్థాయిలో ఎలా పెరుగుతాయో ఈ అధ్యయనం అంచనా వేసింది. కాగా బ్రెజిల్, చైనా, ఇండియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనాపై దృష్టిసారించిన 8 అధ్యయనాల సమాహారం కీలక విషయాలు వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న భూతాపం వల్ల కరవు, వరదలు, పంట దిగుబడి క్షీణత, జీవ వైవిధ్యం తదితర నష్టాలు పెరుగుతాయని అంచనా వేసింది. భూగోళం వేడెక్కడాన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేయడం వల్ల దేశంలోని సగం మంది జీవవైవిధ్యానికి ఆశ్రయంగా పనిచేయవచ్చని వెల్లడించింది..